భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

మహిళల ఆరోగ్యం సక్రమంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యవంతంగా, బలంగా నిలుస్తుందనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ‘స్వాస్థ్‌ నారీ – శ్వశక్త్‌ పరివార్‌ అభియాన్‌’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.

జిల్లాలోస్వాస్థ్ నారీ – శ్వసక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ కార్యక్రమం లో భాగంగా ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.

వైద్య శిబిరాలు నిర్వహించుటకు గాను విస్తృత ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మహిళల ఆరోగ్య రక్షణలో ఈ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాలు (ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల పరిధిలోని ప్రతి మహిళకు ఈ వైద్య శిబిరాల ద్వారా సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలని ఆయన సూచించారు.

మారిన జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు కారణంగా మహిళలు అధికంగా బీపీ, షుగర్, హృద్రోగాలు, క్యాన్సర్, పిసిఒడి, రుతుక్రమణ సమస్యలు వంటి వ్యాధులకు గురవుతున్నారని, ఈ హెల్త్ క్యాంపుల ద్వారా రోగనిర్ధారణ జరిగితే వెంటనే తగిన చికిత్స, అవసరమైన మందులు అందించబడతాయని తెలిపారు.

అదేవిధంగా ఆరోగ్య మహిళ, ఎన్‌సీడీ సెంటర్లు, క్యాన్సర్ డే కేర్ సెంటర్లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయని వివరించారు.

ప్రతి ఆయుష్ ఆరోగ్య మందిరంలో ఔషధ మొక్కలను వాటి పేర్లతో ప్రదర్శించి, మహిళలకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. యుక్త వయసు గల మహిళలకు అవగాహన కార్యక్రమాల లో భాగంగా, పిసిఒడి, నెలసరి సమస్యలు మరియు మహిళా ఆరోగ్యంపై చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అలాగే, అక్టోబర్ 1న జిల్లా వ్యాప్తంగా మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.

ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్సకు ఇబ్బందులు ఎదుర్కొనే పేద మహిళలు ఈ శిబిరాలను వినియోగించుకోవాలని కలెక్టర్ గారు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ప్రత్యేక హెల్త్ క్యాంపులు సమన్వయంతో నిర్వహించబడాలని ఆయన వైద్యాధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వైద్య సిబ్బంది, మహిళా సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఏఎన్ఎంలు, చురుకుగా భాగస్వాములు కావాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మహిళకు ఈ ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా సమగ్ర ఆరోగ్య సేవలు అందించడమే కాకుండా, పోషకాహార ప్రాధాన్యం, జీవనశైలి సంబంధిత వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ స్పష్టం చేశారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణ, శక్తివంతమైన కుటుంబ నిర్మాణం, సమాజ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి స్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్య చందన, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, డిసిహెచ్ఓ రవిబాబు, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనినా, మున్సిపల్ కమిషనర్లు సుజాత, శ్రీకాంత్, వైద్యులు మరియు వైద్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.