మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:12 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మందమర్రి: పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా షేర్ చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటువంటి నేరాలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ కఠిన నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసులు హెచ్చరించారు.

జాతీయ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) అందించిన సమాచారం ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ కేసును మందమర్రి పోలీసులకు అప్పగించింది.

దీనిపై స్పందించిన మందమర్రి ఎస్‌ఐ రాజశేఖర్ సైబర్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం, మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె.శశిధర్ రెడ్డి దర్యాప్తు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

మీడియాతో ఇన్‌స్పెక్టర్ కె. శశిధర్ రెడ్డి మాట్లాడుతూ…

“నాలుగు గోడల మధ్య కూర్చుని మొబైల్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు లేదా ఫోటోలు చూసినా, పంపినా ఎవరికీ తెలియదు అనే భ్రమలో చాలామంది ఉంటున్నారు కానీ, వారికి తెలియకుండానే వారు నేరస్తులుగా మారుతున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా చట్టం దృష్టిలో ఇవి తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి” అని స్పష్టం చేశారు.

ఇంటర్‌నెట్‌లో చిన్నారుల అశ్లీల కంటెంట్‌ను వెతకడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా ప్రచారం చేయడం అత్యంత తీవ్రమైన నేరమని ఆయన హెచ్చరించారు. ఇటువంటి చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిరంతర నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

సమాజంలో చిన్నారుల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అశ్లీల విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.