మంచిర్యాల జిల్లా,
మంచిర్యాల,
తేదీ: 24 జూలై 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే
ప్రింట్, ఎలక్ట్రానిక్ పాత్రికేయులు రాజ్యాంగం కల్పించిన పత్రిక స్వేచ్ఛను సద్వినియోగపరచుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజాస్వామ్యంలో పాత్రికేయ రంగానికి ప్రత్యేక స్థానం ఉందని, అభివృద్ధి, సంక్షేమం దిశగా ప్రభుత్వాలు చేపట్టే పథకాలు, కార్యక్రమాలను విస్తృత ప్రచారం చేయడం ద్వారా ప్రజలందరికీ తెలిపి పథకాల ఫలాలు పొందే విధంగా చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ మారుమూల గ్రామాల నుండి అభివృద్ధి చెందిన పట్టణాల వరకు తమ పరిధిలో జరుగుతున్న అన్యాయాలను, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరించడంలో పాత్రికేయులు తమ వంతు బాధ్యత నిర్వహిస్తారని తెలిపారు.
మీడియా ద్వారా ప్రపంచానికి తెలియని ఎన్నో వాస్తవాలు బయటపడ్డాయని, ఎంతో మంది బాధితులకు అవసరమైన సహాయం, న్యాయం అందాయని తెలిపారు.
కానీ, జిల్లాలో కొంతమంది పాత్రికేయులు అవాస్తవ వార్త కథనాలను ప్రచురిస్తూ వ్యాపార, వాణిజ్య సంస్థలలో, ప్రభుత్వ కార్యాలయాలలో, వ్యక్తిగత బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలియవచ్చిందని తెలిపారు.
పాత్రికేయులు తాము ప్రచురించే విషయాలపై పూర్తి నిజనిర్ధారణ చేసుకోవాలని తెలిపారు. జిల్లాలో కొంతమంది నకిలీ జర్నలిస్టుల కారణంగా అసలైన జర్నలిస్టులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇలాంటి అవాస్తవాలను ప్రచురిస్తూ, బెదిరింపులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
