భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

ఈరోజు (గురువారం) నాటికి గోదావరి నీటిమట్టం 24.45 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. నీటిమట్టం పెరుగుదలతో పాటు, రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.

గోదావరిలో నీటిమట్టం పెరగడంతో భద్రాచలం దిగువన ఉన్న దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. పర్ణశాల వద్ద సీత వాగులోకి నీరు చేరడంతో, పర్యాటకుల భద్రత దృష్ట్యా నార చీరల ప్రాంతానికి సందర్శకులను నిలిపివేశారు.

చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు కూడా వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే, గోదావరి నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల పలు జిల్లాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మెదక్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం,రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

రాజధాని హైదరాబాద్‌లోనూ రోజంతా వర్షం పడుతూనే ఉంది, దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి గురువారం నాటికి అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో మరో మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.