2

స్నేహం అంటే నమ్మకం, ఆపదలో అండగా నిలబడటం అని చెబుతుంటారు. కానీ నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన మాత్రం స్నేహ బంధానికే మచ్చ తెచ్చింది.

అప్పుగా డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడనే కారణంతో ఓ వ్యక్తిని అతని స్నేహితులే హత్య చేసిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పూర్ణాన్ (37), ఆరీఫ్ (26) కొంతకాలంగా నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ మేథర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరు బైక్‌పై తిరుగుతూ చీరల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో అదే ప్రాంతంలో నివసిస్తూ ఎల్లమ్మ పండుగల సందర్భంగా ఆడ వేషధారణలో కార్యక్రమాలు నిర్వహించే బోధ్ సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది.

కాలక్రమేణా ఈ పరిచయం స్నేహంగా మారింది. ముగ్గురూ తరచూ కలిసి తిరగడం, మద్యం సేవించడం వల్ల వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

ఈ స్నేహాన్ని ఆసరాగా చేసుకుని ఫుర్ఖాన్ సాయికుమార్‌ను రూ.30 వేల అప్పు ఇవ్వాలని కోరాడు. అయితే సాయికుమార్ తన వద్ద డబ్బు లేదని, అప్పు ఇవ్వలేనని స్పష్టం చేశాడు.

అయితే ఈ విషయాన్ని ఫుర్ఖాన్ మనసులో పెట్టుకుని సాయికుమార్‌పై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పు ఇవ్వలేదనే కోపంతో అతడిని హత్య చేయాలని ముందుగానే కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.

ఈ నెల 8వ తేదీన ఫుర్ఖాన్ తన మిత్రుడు ఆరీఫ్‌తో కలిసి ఓ ప్రణాళిక రూపొందించాడు.

కేశరాజుపల్లి పరిసర ప్రాంతంలోని ఒక వెంచర్‌లో కలిసి మద్యం సేవిద్దామని సాయికుమార్‌ను పిలిచారు. ముగ్గురూ అక్కడికి వెళ్లి మద్యం సేవిస్తున్న సమయంలో ఫుర్ఖాన్ మరోసారి రూ.30 వేల అప్పు ఇవ్వాలని కోరాడు. అయితే సాయికుమార్ మళ్లీ నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆవేశానికి లోనైన ఫుర్ఖాన్, ఆరీఫ్ కలిసి సాయికుమార్‌పై దాడికి దిగారు. సమీపంలో ఉన్న బండరాయితో అతని తలపై బలంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

హత్య అనంతరం నిందితులు మృతుడి వద్ద ఉన్న సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను తీసుకుని బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.

హత్య జరిగిన తర్వాత ఆధారాలు లేకుండా తప్పించుకోవచ్చని భావించిన నిందితులు దొంగిలించిన బంగారాన్ని విక్రయించేందుకు విజయవాడ వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే కేసు నమోదు చేసిన నల్లగొండ పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టారు.

మృతుడి సెల్‌ఫోన్ సిగ్నల్స్, కాల్ డేటా రికార్డులు, ఇతర డిజిటల్ ఆధారాలను విశ్లేషించిన పోలీసులు నిందితుల కదలికలను గుర్తించారు. అనంతరం విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుల నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి వెల్లడించారు.

సాంకేతిక ఆధారాలు ఎంత కీలకంగా మారాయో ఈ కేసు మరోసారి నిరూపించిందని పోలీసులు పేర్కొన్నారు.