ఆంధ్రప్రదేశ్ లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో జరిగిన పలు దొంగతనాల కేసులను ఛేదించిన అనపర్తి పోలీసులు, రాజమహేంద్రవరం క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. జూదానికి బానిసైన నిందితుడు డబ్బుల కోసం చోరీలను వృత్తిగా మార్చుకుని వరుస నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

పోలవరం జిల్లా అడ్డతీగల మండలం గొంతువానిపాలెం గ్రామానికి చెందిన చిలపనశెట్టి సన్యాసిరావు 2019 నుంచి రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. తాళాలు పగులగొట్టి బంగారం, వెండి ఆభరణాలను అపహరించడం అతడి ప్రధాన నేర పద్ధతిగా పోలీసులు గుర్తించారు.

నిందితుడిపై ఇప్పటికే 45 చోరీ కేసులు నమోదయ్యాయి. వాటిలో ఐదు కేసుల్లో శిక్ష అనుభవించగా, మరో 20 కేసులు ప్రస్తుతం కోర్టుల్లో విచారణలో ఉన్నాయి. ఇటీవల ఆత్రేయపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ చోరీ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన సన్యాసిరావు, ఈ ఏడాది మార్చి 26న బెయిల్‌పై విడుదలయ్యాడు.

అయితే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. మార్చి 31న అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోరుకొండ, రావులపాలెం, ఆలమూరు, నర్సీపట్నం ప్రాంతాల్లో మరో ఆరు దొంగతనాలు చేసినట్లు విచారణలో తేలింది.

లక్ష్మీనరసాపురం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడు అనపర్తి మండలం కొప్పవరం బ్రిడ్జి సమీపంలో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు.

నిందితుడి వద్ద నుంచి రూ.58.09 లక్షల విలువైన 385 గ్రాముల బంగారు ఆభరణాలు, 110 గ్రాముల వెండి వస్తువులు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం డీఎస్పీ విద్య మీడియాకు వెల్లడించారు. నిందితుడిపై మరిన్ని కేసుల వివరాలు కూడా పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.