< 1 Min

Hyderabad Alert: హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో యువతులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని షీ టీమ్స్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ వ్యవహారాలే కాకుండా, పెద్దలు కుదిర్చిన పెళ్లి సంబంధాల పేరుతో కూడా కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నట్లు వెల్లడైంది. ఇటీవల ఇలాంటి కేసులకు సంబంధించిన ఫిర్యాదులు హైదరాబాద్ షీ టీమ్స్‌కు అధిక సంఖ్యలో వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

అధికారుల సమాచారం ప్రకారం, మోసగాళ్లు ముందుగా సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చూపులు నిర్వహించి, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకుంటున్నారు. దీంతో యువతి కుటుంబం పూర్తిగా నమ్మకం పెంచుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి ఖాయమైందనే చనువుతో యువతికి దగ్గరవుతూ భావోద్వేగంగా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

“ఎలాగూ మనిద్దరికీ పెళ్లే కదా” అంటూ నమ్మకం కల్పించి, మానసిక ఒత్తిడి తెచ్చి శారీరక సంబంధాలకు ఒత్తిడి చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతరం తమ అసలు ఉద్దేశాన్ని బయటపెడుతూ భారీ మొత్తంలో డబ్బు లేదా అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో డబ్బు ఇవ్వకపోతే పెళ్లి రద్దు చేస్తామని, కుటుంబ పరువు తీస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు నమోదయ్యాయి. నిశ్చితార్థం జరిగిపోయి బంధువులందరికీ విషయం తెలిసిపోవడంతో, పెళ్లి ఆగిపోతే సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు మౌనం వహిస్తున్నారని అధికారులు గుర్తించారు.

ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు మరింత ఒత్తిడి తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. పరువు కోసం భయపడి సమస్యను దాచిపెడితే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

యువతులు పెళ్లి సంబంధాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన సంబంధం అయినప్పటికీ పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అబ్బాయి వ్యక్తిత్వం, ఉద్యోగం, స్నేహితుల వర్గం, అలవాట్ల గురించి తెలుసుకోవడం అవసరమని సూచిస్తున్నారు.

పెళ్లికి ముందే ఏకాంతంగా కలవాలని లేదా శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అలాంటి వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయాలని, అవసరమైతే స్పష్టంగా తిరస్కరించాలని చెబుతున్నారు. అలాగే డబ్బు, కట్నం లేదా ఇతర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేసినా వెంటనే చట్టపరమైన సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

హైదరాబాద్ షీ టీమ్స్ ప్రకారం, ఇలాంటి మోసాలకు గురైన యువతులు భయపడకుండా ముందుకు రావాలి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. బాధితులు వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని తెలిపారు.