< 1 Min

బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమల్ ఇలాచీ ప్రకటన ద్వారా నిషేధిత పాన్ మసాలా లేదా పొగాకు సంబంధిత ఉత్పత్తులను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మహారాష్ట్ర FDA ప్రకారం, ప్రకటనలో ఉపయోగించిన ‘Vimal Elaichi’ బ్రాండ్ పేరు, ప్రచార విధానం, సంభాషణలు, బ్రాండ్‌కు ఉన్న మార్కెట్ గుర్తింపు వంటివి వినియోగదారుల్లో విమల్ పాన్ మసాలాతో సంబంధాన్ని ఏర్పరచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రకటన సరోగసీ లేదా పరోక్ష ప్రకటన పరిధిలోకి వస్తుందా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు.

ఈ నోటీసుల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 24, సెక్షన్ 53లను FDA ప్రస్తావించింది. తప్పుదారి పట్టించే ఆహార ప్రకటనలకు సంబంధించి సెక్షన్ 53 కింద గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే నోటీసులు జారీ కావడం అంటే నటులు ఇప్పటికే చట్టపరంగా దోషులుగా తేలినట్లు కాదని, వారి వివరణను కోరుతున్న చర్య మాత్రమే.

మహారాష్ట్రలో పొగాకు లేదా నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలాపై నిషేధం అమల్లో ఉంది. 2026 జూలై 13 నుంచి ఈ నిషేధాన్ని మరో ఏడాది పాటు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిషేధిత ఉత్పత్తులతో సంబంధం ఉన్న బ్రాండ్ పేర్లను పరోక్షంగా ప్రచారం చేసే ప్రకటనలపై FDA మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.

ఇదిలా ఉండగా, షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లు ప్రకటనతో తమకు ఉన్న సంబంధం, ప్రచార ఒప్పందాలు, ప్రకటనకు ముందు చేపట్టిన పరిశీలన వంటి వివరాలను FDAకి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే ఈ ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌ను తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలు, వెబ్‌సైట్లు తదితర డిజిటల్ వేదికల నుంచి తొలగించాలని అధికారులు ఆదేశించారు. నోటీసు అందిన తేదీ నుంచి 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని సూచించారు.

ఈ ముగ్గురు నటులు గతంలో కూడా విమల్ పాన్ మసాలా ప్రకటనలపై విమర్శలు ఎదుర్కొన్నారు. తాజా FDA చర్యతో సెలబ్రిటీలు ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల ప్రకటనల్లో పోషించే పాత్రపై మరోసారి చర్చ మొదలైంది.

Disclaimer :
ఈ వార్త వివిధ న్యూస్ వెబ్‌సైట్ల నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రాయబడి, సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. వివరాల పూర్తి ధృవీకరణ పాఠకులదే బాధ్యత. ఈ సమాచారం ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు రచయిత కానీ వెబ్‌సైట్ కానీ బాధ్యత వహించదు.