సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటాము… అందుకే అంటారు.. పూజలు, యజ్ఞాలు, దానాలు, వ్రతాలు చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది అని… ఇంకొంత మంది… వాడు పిల్లికి బిచ్చం కూడా పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు, ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు.. అని!!…

అంటే మోక్షాన్ని గనక పొందాలంటే పూజా పునస్కారాలు చెయ్యాలని, భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, దానధర్మాలు చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు.. సామాన్యంగా మనం ఎప్పుడూ వినేది!!…

శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు!! శాస్త్రాలను గురించి బాగా ఉపన్యాసలిచ్చినా, యజ్ఞాలు చేసి దేవతలను ఆహ్వానించి తృప్తి పరచినా, సత్కర్మలు, పుణ్య కార్యాలు ఎన్ని చేసినా, దేవతలను ఎంతగా పూజించినా ముక్తి లేదు!!
వంద మంది బ్రహ్మల కాలం అంటే కోటానుకోట్ల జన్మలు ఇలా చేసినప్పటికీ ముక్తి రాదు.. అని అంటారు!!…

మరి ఎలా వస్తుంది..?

“ఆత్మైక్య బోధేన” … నేను ఆత్మను అని అనుభవరీత్యా గ్రహిస్తే తప్ప ముక్తిలేదు, పైన చెప్పిన కార్యాలన్నీ సత్కార్యాలే, వాటిని సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే… అయితే ఆ పుణ్యఫలం ఖర్చై పోగానే తిరిగి ఈ లోకంలోకి మళ్లీ తిరిగి రావాలాల్సిందే!!… మళ్ళీ మన చరిత్ర ప్రారంభించ వలసిందే.

అయితే ముక్తి పొందాలనుకున్నవారు మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా మరి!!..
చేయకూడదా.. అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి!!.. ఎందుకు చేయాలి??.. మన మనోబుద్ధుల యొక్క అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి నిష్కామంగా, నిస్వార్థంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం…

చేసినది భగవద్ ఆర్పితం గావించి, నేను కర్తను కాదు అనే భావంతో వుండాలి, జ్ఞానిగా వున్నప్పుడే మోక్షం లభిస్తుంది.