ఆషాఢమాసంలో నేరేడు పండు తినాలని పెద్దలు చెబుతారు. సంవత్సరంలో ప్రతీవారూ ఏనుగు తల పరిమాణమంత మాంసాన్ని ఆహారంగా తీసుకుంటారనీ, దానికి నేరేడు విరుగుడనీ పేర్కొంటారు. దీనిలో ఉండే అంతరార్థాన్ని పరిశీలించాలి. మొక్కలకు ప్రాణముంటుందని జగదీశ్ చంద్రబోసు అనే శాస్త్రవేత్త కనుగొన్నట్లు మనం పాఠ్యాంశాలలో చదువుకున్నాం. కానీ, “ఓషధి” అంటే “ఫలమునిచ్చి మరణించేది” అని అర్థం. వరిధాన్యం వంటివి మనం ఆహారంగా తీసుకుంటాము కదా! అది ప్రాణాన్ని కోల్పోయి, మనకాహారమవుతుంది. అదియే మాంసాహారము. అది సంవత్సరంలో ఏనుగు శిరస్సంత ప్రమాణం.

హింస – ప్రాయిశ్చిత్తము

మనం తెలిసి కూడా ఐదు హింసలకి పాల్పడతాం. వాటిని పంచ సూనములు అంటారు. మన జీవనానికై ఆ హింసలు చేయక తప్పదు. అందులొ మొదటిది “ధాన్యాన్ని ఉత్పత్తి చేసేడప్పటి ప్రాణిహింస”. అందులో భాగమే ధాన్యాహార స్వీకరణ. దానికి ప్రాయశ్చిత్తం “బ్రహ్మయజ్ఞం”. అంటే వేదాధ్యయనం చేయడం – చేయించడం.

ప్రకృతిలో మార్పు – వైద్యం

ఆషాఢంలో ఎండతగ్గి, దేహంనుండీ శ్వేదరూపంలో వచ్చే నీరు, మూత్రంరూపంలో అధికంగా విడుదల అవుతుంది. వాతావరణంలోని మార్పు జీర్ణకోశాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అతిమూత్రవ్యాధికి నేరేడు మంచి మందనీ, వెంట్రుకలను కూడా కరగించి అరగించే శక్తి దానికి ఉందనీ జీవశాస్త్రంలో విద్యార్థులు చదువుతారు. వీటిని బట్టీ గమనించవలసిన విషయాలు

వాతావరణంలోని మార్పుకు దేహం సరి అయ్యే విధంగా, ఆ కాలంలో ప్రకృతి అందించే నేరేడు ఔషధంలా ఉపయోగించడమూ,

బ్రహ్మయజ్ఞం ఆవశ్యకత గుర్తించి, మన అపూర్వ జ్ఞానరాశియైన వేదాలని కాపాడుకోవడాన్ని బేరీజు వేసుకునే విధంగానూ పెద్దలు మనకిచ్చిన వరం. కాబట్టి మన పెద్దలు ఆషాఢ మాసం సందర్భంగా మనకందిచ్చిన ఆరోగ్య సూత్రాన్ని పాటిస్తూ,
తద్వారా, దాని వెనక ఏర్పరచిన సాంకేతిక కారణాన్ని తెలుసుకొని, శాస్త్రీయ విజ్ఞానాన్ని కాపాడుకొందాం.

సేకరణ