మంచిర్యాల జిల్లా,
మందమర్రి,
తేదీ:27 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మందమర్రి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో సురక్షితంగా జరుపుకోవాలని మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ప్రజలను కోరారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఏ.భాస్కర్, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ల ఆదేశాల మేరకు మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, ప్రజలు పండుగను ఆనందంగా జరుపుకునే క్రమంలో భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గణేష్ మండపాల ఏర్పాట్లు గురించి పోలీస్ వారికి సమాచారం అందించాలని, విగ్రహం సైజు, బరువు, ఉత్సవాల నిర్వహణ తేదీలు, నిమజ్జనం వివరాలు, కమిటీ సభ్యుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అన్నారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, అనుభవజ్ఞులైన వారి ద్వారా మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయించుకోవాలని, గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ, విద్యుత్ శాఖల నుండి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. వివాదాస్పద స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని, పూర్తి జాగ్రత్తలు పాటించాలని, మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు పూర్తి బాధ్యత వహించాలని చెప్పారు.

రాత్రిపూట కనీసం ఇద్దరు కమిటీ సభ్యులు కాపలాగా ఉండి, చిన్న పిల్లలు, వృద్ధులను మండపాల వద్ద పడుకోనివ్వరాదని, మండపంలో మండే స్వభావం ఉన్న పదార్థాలు లేదా పటాకులు ఉంచకూడదని సూచించారు. అగ్నిప్రమాదాలు జరిగితే వాటిని అదుపు చేయడానికి ఇసుక, నీటిని సిద్ధంగా ఉంచుకోవాలని, ఉదయం 8 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని, ఇతర మతాలు, కులాలను కించపరిచే పాటలు లేదా అసభ్యకరమైన పాటలు పెట్టరాదని, గణేష్ మండపం వద్ద లేదా ఊరేగింపులో డీజేలను వాడటం పూర్తిగా నిషేదించడమైనదని, ఊరేగింపు సమయంలో ముస్లిం ప్రార్థనల వేళ మసీదుల వద్ద మైకులు ఆపి, ప్రశాంతంగా వెళ్ళాలని కోరారు. మండపాలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకుండా ఏర్పాటు చేయాలి.

నిమజ్జనం మరియు పర్యావరణ పరిరక్షణ
నిమజ్జనం రోజున పోలీసులు సూచించిన మార్గాల్లో మాత్రమే ఊరేగింపు నిర్వహించాలి. ఊరేగింపు నిర్ణీత సమయంలోగా పూర్తయ్యేలా చూసుకోవాలి. ఊరేగింపు సమయంలో వాలంటీర్లను నియమించుకుని, కమిటీ సభ్యులు విగ్రహంతో పాటు ఉండాలి. మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనరాదని, సమావేశం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతులను పూజించాలని సీఐ శశిధర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను నిర్వాహకులకు పంపిణీ చేశారు.

ఈ సమావేశంలో ఎస్ఐ రాజశేఖర్, ఎలక్ట్రిసిటీ ఏఈ, గణేష్ మండపాల నిర్వాహకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

error: -